వేములవాడలో జేఎన్టీయూ విద్యార్థుల రాస్తారోకో – అరెస్టులో విద్యార్థి నాయకులు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని అగ్రహారం ప్రాంతంలో జేఎన్టీయూ విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం రాస్తారోకో చేపట్టారు. ప్రస్తుతం తాత్కాలికంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో నిర్వహిస్తున్న తరగతుల గదులు, ప్రయోగశాలలు, మరుగుదొడ్లకు అధికారులు తాళాలు వేసినందుకు విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజులుగా నిరసనలు చేస్తున్నప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఉద్యమానికి ఏబీవీపీ, బీఆర్ఎస్వీ నాయకులు మద్దతు ప్రకటించారు.
రాస్తారోకో కారణంగా కరీంనగర్–సిరిసిల్ల ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న వేములవాడ సీఐ వీరప్రసాద్ పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థులను సమాధానపరచడానికి ప్రయత్నించారు. కానీ వారు వెనక్కి తగ్గకపోవడంతో, విద్యార్థులు అలాగే ఏబీవీపీ, బీఆర్ఎస్వీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. అనంతరం ట్రాఫిక్ సమస్య సద్దుమణిగింది.