ఘనంగా బీర్కూర్లో మహాత్మా బసవేశ్వర 895వ జయంతి వేడుకలు.
బీర్కూర్, ఏప్రిల్ 20(డిడి9 వార్త):
మహాత్మా బసవేశ్వర 895వ జయంతి సందర్భంగా బీర్కూర్ పట్టణంలో అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దామరంచ భూషణం స్వామి మాట్లాడుతూ బసవేశ్వరుడు గొప్ప సామాజిక సంస్కర్త, తత్వవేత్త అని పేర్కొన్నారు.12వ శతాబ్దంలోనే సమాజంలో సమానత్వం కోసం ఆయన చేసిన కృషి అపారమని అన్నారు. కుల, మత భేదాలు లేకుండా అందరూ సమానులే అన్న భావజాలాన్ని బసవేశ్వరుడు ప్రపంచానికి చాటిచెప్పారని తెలిపారు.
స్త్రీలకు సమాన హక్కులు కల్పించడంలో బసవేశ్వరుడి పాత్ర విశేషమని, సమాజంలో ఉన్న అసమానతలను తొలగించేందుకు ఆయన ఎన్నో సామాజిక విప్లవాలు సృష్టించారని స్వామి వివరించారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయాలన్న దృక్పథంతో పనిచేసిన మహానుభావుడిగా బసవేశ్వరుడిని గుర్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ జయంతి ఉత్సవాల్లో బీర్కూర్ గ్రామ సర్పంచ్ అరిగే ధర్మ తేజ, ఉప సర్పంచ్ పరమేశ్ పంతులు, గ్రామ పెద్దలు, నాయకులు మరియు లింగాయత్ సమాజ్ సభ్యులు పాల్గొన్నారు.

