ఉత్నూర్లో వైభవంగా పెద్దమ్మ తల్లి వార్షికోత్సవం
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల ఉత్నూర్ గ్రామంలో శ్రీశ్రీశ్రీ పెద్దమ్మ తల్లి పరివార దేవతా ప్రథమ వార్షికోత్సవ వేడుకలు శనివారం అత్యంత వైభవంగా జరిగాయి. చైత్ర మాస నవమిని పురస్కరించుకుని గ్రామ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక ఉత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం 7 గంటల నుంచే ఆలయంలో బ్రాహ్మణ ఆహ్వానం, స్వస్తి పుణ్యహవచనం, ధ్వజారోహణంతో వేడుకలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. అనంతరం ముఖ్యదేవతా పూజ, అగ్నిప్రతిష్ఠ, హవనం, పూర్ణాహుతి కార్యక్రమాలను అర్చకులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉత్సవంలో ప్రధాన ఘట్టమైన శ్రీశ్రీశ్రీ పెద్దమ్మ - పెదద్దిరాజుల కళ్యాణ మహోత్సవాన్ని మధ్యాహ్నం 12:25 గంటలకు అభిజిత్ లగ్న పుష్కరాంశ సుముహూర్తమున కన్నులపండువగా జరిపించారు. మంగళవాయిద్యాల నడుమ జరిగిన ఈ కళ్యాణ వేడుకను భక్తులు తన్మయత్వంతో వీక్షించారు. అనంతరం భక్తులకు భారీగా అన్నప్రసాద వితరణ చేపట్టారు. సాయంత్రం వేళ మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకలతో ఉత్నూర్ గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. ఈ కార్యక్రమానికి తరలివచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముదిరాజ్ సంఘం ప్రతినిధులు అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించారు.


