ఏడో రోజుకు చేరిన విద్యుత్ ఆర్టిజన్ల సమ్మె
మద్దతు తెలిపిన ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్ సర్కిల్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఆర్టిజన్ల జేఏసీ పిలుపులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న సమ్మె మంగళవారం నాటికి ఏడో రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా నిజామాబాద్ సర్కిల్ కార్యాలయం ఎదుట డిచ్పల్లి, నిజామాబాద్ డివిజన్లతో పాటు ట్రాన్స్కోకు చెందిన వందలాది మంది ఆర్టిజన్ కార్మికులు భారీ ఎత్తున నిరసన చేపట్టారు.
ఒకే సంస్థలో అందరికీ ఒకే నిబంధనలు వర్తింపజేయాలని, విద్యార్హతను బట్టి కన్వర్షన్ ప్రక్రియ చేపట్టాలని కార్మికులు డిమాండ్ చేశారు. పీస్రేట్ వర్కర్లు, అన్మ్యాండ్ వర్కర్లు, మీటర్ రీడర్లను ఆర్టిజన్లుగా సంస్థలో విలీనం చేయాలని కోరారు. జీవో నంబర్ 11 ప్రకారం వారికి ఈఎస్ఐ, ఈపీఎఫ్ సౌకర్యాలతో పాటు కనీస వేతనాన్ని ప్రకటించాలని నినదించారు.
ఈ సమ్మె శిబిరాన్ని నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మరియు 1104 యూనియన్ డిస్కమ్ ప్రెసిడెంట్ రఘునందన్ సందర్శించి తమ పూర్తి మద్దతును ప్రకటించారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ డివిజన్ల నుంచి సుమారు 500 మందికి పైగా కార్మిక నాయకులు, కార్యకర్తలు పాల్గొని సమ్మెను విజయవంతం చేశారు.

