భద్రాచలంలో గవర్నర్ శివప్రతాప్ శుక్ల
శ్రీ సీతారామచంద్ర స్వామి పట్టాభిషేకానికి హాజరు
సారపాక ఐటిసి హెలిప్యాడ్ వద్ద ఘన స్వాగతం
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆత్మీయ ఆహ్వానం
పాల్గొన్నా ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు
స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజు
పారంపర్య మర్యాదలతో గవర్నర్కు స్వాగతం

భద్రాచలం,మార్చి 28,(డిడి9 వార్త):
భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పట్టాభిషేక మహోత్సవాన్ని పురస్కరించుకొని భద్రాచలం ప్రాంతం ఆధ్యాత్మిక ఉత్సాహంతో కళకళలాడుతోంది. ఈ మహోత్సవానికి హాజరుకావడానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా భద్రాచలం విచ్చేశారు.
గవర్నర్ రాక సందర్భంగా సారపాకలోని ఐటిసి హెలిప్యాడ్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘన స్వాగతం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత శాఖామంత్రి తుమ్మల నాగేశ్వర రావు , భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట రావు , జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తదితరులు గవర్నర్ను ఆత్మీయంగా ఆహ్వానించారు.
పారంపర్య మర్యాదలతో, పుష్పగుచ్ఛాలు సమర్పిస్తూ గవర్నర్కు స్వాగతం పలికిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ మహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ప్రతిబింబించారు. అనంతరం గవర్నర్ భద్రాచలం చేరుకొని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా భద్రాచలం పట్టణం మొత్తం భక్తజన సంద్రముగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి దర్శనానికి క్యూల్లో నిలుస్తున్నారు. భద్రాద్రి దేవస్థానం ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లు, సౌకర్యాలు పటిష్టంగా ఏర్పాటు చేయగా, పోలీసులు ట్రాఫిక్ నియంత్రణలో ప్రత్యేక చర్యలు చేపట్టారు.
శ్రీరాముని పట్టాభిషేకం ధర్మం, సత్యం విజయానికి ప్రతీకగా భావించబడుతుండగా, ఈ మహోత్సవాన్ని దర్శించుకోవడం భక్తులకు మహా పుణ్యఫలాన్ని ఇస్తుందని పండితులు చెబుతున్నారు.

