ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఫారిన్ కాంట్రిబ్యూషన్ అమెండ్మెంట్ బిల్-2026 పై ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీలో నిజామాబాద్ లోక్సభ సభ్యుడు ధర్మపురి అర్వింద్ స్థానం దక్కించుకున్నారు. ఈ మేరకు కమిటీ సభ్యుల జాబితాతో లోక్సభ గురువారం అధికారిక బులెటిన్ విడుదల చేసింది. లోక్సభ, రాజ్యసభలకు చెందిన మొత్తం 31 మంది ఎంపీలతో ఈ జాయింట్ కమిటీని రూపకల్పన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ.. కీలకమైన పార్లమెంటరీ కమిటీలో భాగస్వామ్యం కల్పించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ భద్రత, పారదర్శకత, దేశ ప్రయోజనాలను ప్రామాణికంగా తీసుకుని బిల్లుపై కమిటీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తానని స్పష్టం చేశారు. నిజామాబాద్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా సమస్యలపై పోరాడుతూనే, దేశహితానికి సంబంధించిన అంశాల్లో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తానని పేర్కొన్నారు.

