మారథాన్లో పోలీస్ కానిస్టేబుళ్ల సత్తా
మెడల్స్ సాధించిన సిబ్బందికి సీపీ సాయి చైతన్య అభినందనలు
హైదరాబాద్లో జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎమ్డీసీ) ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన 42.195 కిలోమీటర్ల 'ఫుల్ మారథాన్'ను విజయవంతంగా పూర్తి చేసిన జిల్లా పోలీసు కానిస్టేబుళ్లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య మంగళవారం అభినందించారు. నెక్లెస్ రోడ్ నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు జరిగిన ఈ పరుగులో కానిస్టేబుల్ పి.మహిపాల్ 5 గంటల 05 నిమిషాల 41 సెకన్లలో, సతీష్ 5 గంటల 55 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరుకుని మెడల్స్ సాధించారు.
కమిషనరేట్ కార్యాలయంలో విజేతలకు మెడల్స్ అందజేసిన సీపీ మాట్లాడుతూ.. విధుల్లో తీరిక లేకపోయినా క్రీడలపై పట్టుదలతో నిరంతరం సాధన చేస్తూ ప్రతిభ చాటడం అభినందనీయమన్నారు. ఇతర సిబ్బందికి ఇది స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కానిస్టేబుల్ మహిపాల్ ఇప్పటికే 10కి పైగా రన్నింగ్ ఈవెంట్లలో పాల్గొన్నారని, అక్టోబర్లో ఢిల్లీలో జరిగే వేదాంత హాఫ్ మారథాన్కు ఎంపిక కావడం విశేషమన్నారు. భవిష్యత్తులోనూ జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎంఓ శేఖర్ బాబు పాల్గొన్నారు.

