గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
ఒక్క కెమెరా 100 మంది పోలీసులతో సమానం...
పెగడపల్లిలో 15 సీసీ కెమెరాలను ప్రారంభించిన సీపీ పి.సాయిచైతన్య
గ్రామీణ ప్రాంతాల్లో నేరాల నివారణకు, శాంతిభద్రతల పరిరక్షణకు సీసీ కెమెరాలు ఎంతో కీలకమని, ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసు సిబ్బందితో సమానమని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయిచైతన్య తెలిపారు. గురువారం బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెగడపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ‘మన ఊరు-మన భద్రత-మన బాధ్యత’ కార్యక్రమంలో భాగంగా శాలిమార్ హ్యాచరీస్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన 15 సీసీ కెమెరాలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ మాట్లాడుతూ.. నిరంతరం గ్రామంలో జరిగే అనుమానాస్పద కార్యకలాపాలను పసిగట్టేందుకు, నేరాలను అరికట్టేందుకు సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. గ్రామీణ ప్రజలు, వ్యాపారులు తమ ప్రాంతాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా పోలీసు శాఖకు సహకరించాలని పిలుపునిచ్చారు. 15 సీసీ కెమెరాల ఏర్పాటుకు ఉదారంగా ముందడుగు వేసిన శాలిమార్ హ్యాచరీస్ యాజమాన్యాన్ని అభినందించారు. అనంతరం సైబర్ నేరాలు, డ్రగ్స్ నివారణ, ఉపాధి, రక్షణ అంశాలపై సీపీ మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయని, గతేడాది జిల్లాలో జరిగిన ప్రమాదాల్లో 340 మంది చనిపోగా అందులో 200 మందికి పైగా గ్రామీణ ప్రాంతాల వారే ఉండడం బాధాకరమన్నారు. వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ భద్రతా నియమాలు పాటించాలని సూచించారు.
అనంతరం గ్రామంలోని పాఠశాల విద్యార్థినులు, డ్వాక్రా మహిళలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. విద్యార్థులు చెడు అలవాట్లకు, అనవసరమైన ఆకర్షణలకు లోనుకాకుండా, బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగి తల్లిదండ్రులకు, సమాజానికి మంచి పేరు తేవా లని సీపీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రూరల్ సీఐ విజయ్ బాబు, ఎస్ఐ రాజశేఖర్, గ్రామ సర్పంచ్ రచన సుదర్శన్, శాలిమార్ హ్యాచరీస్ మేనేజర్ ఇమ్రాన్ ముల్లా, గ్రామ ఉపసర్పంచ్ షబ్బీర్, విలేజ్ కమిటీ ప్రెసిడెంట్ సాయిబాబు, ప్రజాప్రతినిధులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

