ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
ఈ నెల 3న సర్టిఫికెట్ల పరిశీలన... వెల్లడించిన సీపీ సాయి చైతన్య
పోలీస్ శాఖ ద్వారా భర్తీ చేసే సబ్ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అర్హులైన అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలో ఉచిత శిక్షణకు ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 3న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య నిజామాబాద్లోని ఏఆర్ హెడ్క్వార్టర్స్లో రిపోర్టు చేయాలని ఆదేశించారు. హాజరయ్యే అభ్యర్థులు తమ వెంట రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ మెమోల జిరాక్స్ ప్రతులను తీసుకురావాలని సూచించారు. నిరుద్యోగ యువత ఈ ఉచిత శిక్షణా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీపీ కోరారు.a

