ఆర్. నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన కామెంట్స్పై మెగాస్టార్ చిరంజీవి స్పందనకు సీనియర్ నటుడు, ప్రజా చిత్రకారుడు ఆర్. నారాయణ మూర్తి మద్దతు తెలిపారు.
చిరంజీవి చెప్పింది 100 శాతం నిజం అని నారాయణ మూర్తి పేర్కొన్నారు. జగన్ను కలిసిన వారిలో తాను కూడా ఉన్నానని, ఆ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అత్యంత గౌరవంగా ఆతిథ్యం ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. “గత గవర్నమెంట్ చిరంజీవి ని అవమానించిందనే ప్రచారం తప్పు. చిరంజీవి నాకు స్వయంగా ఫోన్ చేశారు, అదే ఆయన సంస్కారం,” అని నారాయణ మూర్తి అన్నారు.
అలాగే, ఆ రోజు సమస్య పరిష్కారం కావడానికి చిరంజీవి చేసిన కృషి కారణమని ఆయన స్పష్టం చేశారు. “చిరంజీవి పరిశ్రమ పెద్దగా సీఎం జగన్తో మాట్లాడారు. ఆయన వల్లే ఆ సమస్య పరిష్కారం అయింది,” అని తెలిపారు.
ప్రస్తుతం కూడా సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
బాలకృష్ణపై స్పందించమన్న ప్రశ్నకు, “నేను బాలకృష్ణ గురించి మాట్లాడదల్చుకోలేదు,” అని స్పష్టం చేశారు. అయితే సినిమా టికెట్ ధరల విషయంలో తన అభిప్రాయం వెల్లడించారు. “సినిమా టికెట్ ధరలు పెంచకూడదు. సామాన్యుడికి వినోదాన్ని అందించేది కేవలం సినిమా మాత్రమే. టికెట్లు పెంచితే సామాన్యుడు ఇబ్బందులు పడతాడు,” అని నారాయణ మూర్తి వ్యాఖ్యానించారు.

