చేతన్నగర్లో ఉచిత వైద్య శిబిరం
నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల చేతన్నగర్ గ్రామంలో ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతమైంది. స్టార్ హాస్పిటల్ యాజమాన్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో సుమారు వందలాది మంది గ్రామస్తులు తమ ఆరోగ్య సమస్యలను పరీక్షించుకున్నారు. శిబిరంలో పాల్గొన్న వైద్యులు డాక్టర్ అఖిల్, డాక్టర్ ఇర్ఫాన్ రోగులకు బి.పి, షుగర్ వంటి సాధారణ పరీక్షలతో పాటు వివిధ రకాల సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. పరీక్షల అనంతరం బాధితులకు అవసరమైన ఔషధాలను స్టార్ హాస్పిటల్, వడ్ల సురేష్ హాస్పిటల్ సిబ్బంది సమన్వయంతో ఉచితంగా పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో సరైన వైద్యం అందుబాటులో లేని వారికి ఇలాంటి ఉచిత శిబిరాలు ఎంతో ప్రయోజనకరమని వైద్యులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. గ్రామస్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి శిబిరాన్ని నిర్వహించిన వైద్య బృందాన్ని స్థానిక సర్పంచ్ కురాడే కాంత సునీల్, ఉప సర్పంచ్ గాయక్వాడ్ యాదవ్ అభినందించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ ప్రతినిధులు సర్పంచ్, ఉప సర్పంచులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సేవా కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బాలాజీ, జీపీ వార్డు సభ్యులు లక్ష్మణ్, హాస్పిటల్ సిబ్బంది కపిల్, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.

