రేషన్ బియ్యం మాఫియాపై 'సీసీఎస్' పంజా
వరుస మెరుపు దాడులతో అక్రమ వ్యాపారుల గుబులు
బోధన్లో పిడిఎస్ బియ్యం, వాహనాల పట్టివేత
నిజామాబాద్ జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ దందాను అరికట్టేందుకు పోలీస్ యంత్రాంగం నిఘాను మరింత పటిష్టం చేసింది. పేదల ఆకలి తీర్చాల్సిన ప్రభుత్వ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ లాభాలు గడిస్తున్న ముఠాల ఆటకట్టించేందుకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య కఠిన ఆదేశాల మేరకు సీసీఎస్ (సెంట్రల్ క్రైమ్ స్టేషన్) బృందాలు బుధవారం రంగంలోకి దిగాయి. సీసీఎస్ ఇంచార్జ్ ఏసీపీ మస్తాన్ వాలి నేతృత్వంలో పోలీసులు బోధన్ పట్టణంతో పాటు శివారు ప్రాంతాల్లో విస్తృత సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెగడాపల్లిలో గల శ్రీ రాఘవేంద్ర బిన్నీ రైస్ మిల్లుపై పోలీసులు ఒక్కసారిగా మెరుపు దాడి చేసి తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సుమారు 450 క్వింటాళ్ల ప్రభుత్వ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచినట్లు గుర్తించి అధికారులు విస్తుపోయారు. ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉంచిన ఈ నిల్వలతో పాటు, రవాణాకు ఉపయోగిస్తున్న టాటా ఏప్ (TS16T0397) వాహనాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కేవలం రైస్ మిల్లులే కాకుండా బోధన్ పట్టణంలోని ప్రధాన వ్యాపార కేంద్రాల్లోని డిపోలపై కూడా సీసీఎస్ బృందాలు ప్రత్యేక దృష్టి సారించాయి. పాత బస్టాండ్ మరియు పోస్ట్ ఆఫీస్ సెంటర్లలోని రైస్ డిపోల్లో జరిపిన సోదాల్లో సుమారు లక్ష రూపాయలకు పైగా విలువ చేసే 95 బస్తాల పిడిఎస్ బియ్యాన్ని పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే పోస్ట్ ఆఫీస్ సమీపంలో అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్న మరో టాటా ఏప్ (AP 25 W 1481) వాహనాన్ని కూడా పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న భారీ నిల్వలను మరియు వాహనాలను తదుపరి విచారణ నిమిత్తం బోధన్ రూరల్ మరియు పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓలకు అప్పగించారు. ప్రభుత్వ పథకాలను దుర్వినియోగం చేస్తూ పేద ప్రజలకు అందాల్సిన ఆహార ధాన్యాలను బ్లాక్ మార్కెట్కు తరలించే వారిపై ఉక్కుపాదం మోపుతామని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు. పోలీసుల వరుస మెరుపు దాడులతో అక్రమ బియ్యం వ్యాపారుల్లో ఒక్కసారిగా గుబులు మొదలైంది.

