అమ్దాపూర్లో భక్తిప్రపత్తుల మధ్య ‘హిందూ సమ్మేళనం’
హిందువులందరూ ఐకమత్యంగా ఉండాలి : ఆధ్యాత్మికవేత్తల ప్రబోధం
భక్తి శ్రద్ధలతో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం అమ్దాపూర్ గ్రామం భక్తి పారవశ్యంలో మునిగితేలింది. గ్రామంలో నిర్వహించిన ‘హిందూ సమ్మేళనం’ ఆధ్యాత్మిక శోభతో అత్యంత వైభవంగా జరిగింది. సనాతన ధర్మ పరిరక్షణ, హిందూ ఐక్యత లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఊట్ పల్లి ఉప మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.
ధర్మరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
ఈ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీబాలయోగి పిట్ల కృష్ణ మహారాజ్ స్వామి, విశిష్ట అతిథి సద్గురు మహదేవ్ స్వామీ (గుడిమెట్) భక్తులకు దిశానిర్దేశం చేశారు. మానవ జన్మలో భక్తి మార్గం ఉత్తమమైనదని, ప్రతి ఒక్కరూ సనాతన ధర్మాన్ని అనుసరించాలని కోరారు. ప్రధాన వక్త ఉల్లెంగ ముత్యం, ముఖ్య వక్త మైస్త్రీ సురేఖ మాట్లాడుతూ.. హిందువులందరూ ఐకమత్యంగా ఉండి ధర్మ రక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు.
మారుమోగిన హనుమాన్ నామస్మరణ
కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. వందలాది మంది భక్తులు ఏకకంఠంతో చాలీసాను పఠించడంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. హిందూ సమ్మేళన నిర్వహణ సమితి అధ్యక్షులు సిర్ప సుదర్శన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా సాగింది.
తరలివచ్చిన జనవాహిని
అమ్దాపూర్తో పాటు ఎరాజ్ పల్లి, రాజీవ్ నగర్ తండా, బెల్లాల్, సంగం, మినార్ పల్లి, భవాని పేట్ గ్రామాల నుంచి సర్పంచులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు ఈ సమ్మేళనంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామాలన్నీ కాషాయ జెండాలతో, భక్తి గీతాలతో సందడిగా మారాయి.

