పూలే ఆశయ సాధనకు కదలిరండి
రేపు మహాత్మా జ్యోతిబాపూలే 200వ జయంతి ఉత్సవాలు
సామాజిక విప్లవ పితామహుడు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబాపూలే 200వ జయంతి వేడుకలను శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సమాజంలో పాతుకుపోయిన అసమానతలపై పోరాడి, విద్యతోనే విముక్తి సాధ్యమని చాటిచెప్పిన పూలే ఆశయాలను నేటి తరానికి చాటిచెప్పేందుకు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ వేడుకల్లో భాగంగా ఉదయం 9 గంటలకు నగరంలోని వినాయక్ నగర్ హనుమాన్ జంక్షన్ విగ్రహాల పార్కులో ఉన్న పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నట్లు వివరించారు. అనంతరం 10:30 గంటలకు దుబ్బలోని మున్నూరుకాపు సంఘ భవనంలో ప్రభుత్వ అధికారిక సభా కార్యక్రమం జరుగుతుందని, ఈ సభకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో పాటు ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని తెలిపారు. జిల్లాలోని బీసీ ప్రజలు, సామాజిక కార్యకర్తలు మరియు పూలే అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చి ఈ జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.


