మానవ అక్రమ రవాణాపై యువత అప్రమత్తంగా ఉండాలి: జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి ఐ. ప్రసన్న
కామారెడ్డి జిల్లా బ్యూరో, జూలై 30(డిడి9 వార్త):
మానవ అక్రమ రవాణాపై యువత అప్రమత్తంగా ఉండాలని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి ఐ. ప్రసన్న పిలుపునిచ్చారు.జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న జిల్లా మహిళా సాధికారత కేంద్రం, సఖి కేంద్రం సంయుక్తంగా మిషన్ శక్తి పథకం కింద గురువారం కామారెడ్డిలోని ఆర్కే డిగ్రీ కళాశాలలో మానవ అక్రమ రవాణాపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాయి.ఈ సందర్భంగా ఐ. ప్రసన్న మాట్లాడుతూ, మానవ అక్రమ రవాణా సమాజానికి తీవ్రమైన ముప్పుగా మారుతోందని పేర్కొన్నారు.అక్రమ రవాణా జరిగే విధానాలు, దానికి దారితీసే కారణాలు, యువత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుమానాస్పద ఘటనలు ఎదురైనప్పుడు వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాల్సిన అవసరాన్ని విద్యార్థులకు వివరించారు.అలాగే మాదకద్రవ్యాల వినియోగం, సెల్ఫోన్ వ్యసనం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తూ, జీవితంలో స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని క్రమశిక్షణతో కష్టపడి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు.జిల్లా న్యాయ సేవల ప్రాధికార సంస్థ తరఫున పాల్గొన్న న్యాయవాది కె. సిద్ధిరాములు విద్యార్థులకు న్యాయపరమైన హక్కులు, మౌలిక హక్కులు, మహిళలు, పిల్లల రక్షణకు సంబంధించిన చట్టాలపై అవగాహన కల్పించారు.అనంతరం కళాజాత బృందం పాటలు, ప్రదర్శనల ద్వారా మానవ అక్రమ రవాణా నివారణ, మాదకద్రవ్యాల నిర్మూలన, మహిళల భద్రత వంటి అంశాలపై విద్యార్థులను చైతన్యపరిచింది.ఈ కార్యక్రమంలో ఆర్కే డిగ్రీ కళాశాల సీఈవో జైపాల్ రెడ్డి, ప్రిన్సిపాల్ నవీన్, అమృత దత్తహరి, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

