లారీ ఢీకొని ఏడేళ్ల విద్యార్థిని మృతి
బాన్సువాడ,ఆగస్టు 27(డిడి9 వార్త): బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ చౌరస్తా వద్ద గురువారం ఉదయం విషాదకర ఘటన చోటుచేసుకుంది. పాఠశాలకు వెళ్తున్న ఏడేళ్ల బాలికను మహారాష్ట్రకు చెందిన లారీ ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.స్థానికుల వివరాల ప్రకారం.. లారీ డ్రైవర్ అతివేగంగా, నిర్లక్ష్యంగా వాహనం నడుపుతూ పాఠశాలకు వెళ్తున్న బాలికను ఢీకొట్టినట్లు తెలుస్తోంది.ప్రమాదంలో బాలిక లారీ టైర్ల కింద పడి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.బాలిక మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.వారి రోదనలు అక్కడున్న వారిని సైతం కంటతడి పెట్టించాయి.చిన్నారి మృతితో బాన్సువాడ పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

