విద్యార్థుల విద్యా సామర్థ్యాల పరిశీలన - నోట్బుక్స్ పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి,జనవరి 02(డిడి9 వార్త):
రామారెడ్డి మండలం గిద్ద గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల విద్యా స్థాయిని స్వయంగా పరిశీలిస్తూ, వారికి నోట్బుక్స్ పంపిణీ చేశారు.తరగతి గదుల్లో విద్యార్థులను బోర్డుపై గణితశాస్త్ర లెక్కలు వ్రాయించి, ప్రశ్నలకు సమాధానాలు చెప్పిస్తూ వారి అవగాహన స్థాయిని కలెక్టర్ పరీక్షించారు. విద్యార్థుల ప్రదర్శనను ప్రశంసిస్తూ, మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థిని అభినందించారు.విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ వహించాలని, ఉపాధ్యాయులు నాణ్యమైన బోధన అందించాలని కలెక్టర్ సూచించారు. తరగతుల్లో విద్యార్థులతో పరస్పర చర్చ జరిపి బోధనా ప్రక్రియను గమనిస్తూ, ప్రాథమిక నైపుణ్యాలు మెరుగుపడేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు.పదవ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా పెట్టుకొని విద్యార్థులను సిద్ధం చేయాలని కలెక్టర్ అన్నారు. ఇందుకోసం ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు నిర్వహించి, విద్యార్థుల లోపాలను గుర్తించి తగిన మార్గనిర్దేశం చేయాలని సూచించారు. ప్రతి విద్యార్థి ప్రతిభ వెలుగులోకి వచ్చేలా బోధన కొనసాగించాలని పేర్కొన్నారు.అలాగే పాఠశాల ఆవరణను పిచ్చి మొక్కలు, చెత్తాచెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, ఆర్డివో వీణ, డిఈవో రాజు, తహసిల్దార్ ఉమలత, ఎమ్ఈవో తదితర అధికారులు పాల్గొన్నారు.

