రాహుల్ గాంధీ, కాంగ్రెస్–CJP కూటమి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీజేపీ నాయకులు
బీర్కూర్, జూలై 23(డిడి9 వార్త): ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నివాసం ముట్టడికి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చేపట్టిన నిరసనలను, అలాగే హైదరాబాద్లో బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి యత్నించిన ఘటనను నిరసిస్తూ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు అరెస్టును ఖండిస్తూ శుక్రవారం బీర్కూర్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ, కాంగ్రెస్–CJP కూటమి దిష్టిబొమ్మలను దహనం చేశారు.ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు నాగేళ్ల సాయికిరణ్ మాట్లాడుతూ, ఢిల్లీలో కాంగ్రెస్, CJP కూటమి పార్టీలు విద్యార్థుల ముసుగులో అల్లర్లకు పాల్పడుతూ దేశానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.ఇటువంటి చర్యలు దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగించేలా ఉన్నాయని, దేశ ప్రయోజనాలకు విరుద్ధమైన రాజకీయాలు ప్రజలు సహించరని అన్నారు. కాంగ్రెస్, CJP పార్టీలు తమ వైఖరిని మార్చుకోకపోతే భవిష్యత్తులో దేశ ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ఉపాధ్యక్షుడు హనుమాన్లు, మండల యువమోర్చా నాయకుడు కొట్టే వినీష్, సీనియర్ నాయకులు సాయిబాబా, బీరుగొండ, పండరి, కార్యకర్తలు బసవరాజ్, ప్రవీణ్, నాగేష్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

