బీర్కూర్ MEOపై బీఆర్ఎస్వి స్టేట్ జనరల్ సెక్రెటరీ ఫిర్యాదు.. విచారణకు డిమాండ్
బాన్సువాడ, జూలై 21(డిడి9 వార్త): కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల విద్యాశాఖ అధికారి పై బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గైని సంపత్ తీవ్ర ఆరోపణలు చేస్తూ మంగళవారం తహసీల్దార్ కు వినతి పత్రాన్ని సమర్పించారు.వినతి పత్రంలో పేర్కొన్న వివరాల ప్రకారం.. బీర్కూర్ మండలంలోని జడ్పీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నుంచి వివిధ అవసరాల పేరుతో అక్రమంగా నగదు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.ప్రభుత్వ నిబంధనల ప్రకారం 9వ, 10వ తరగతి విద్యార్థుల నుంచి రూ.130 మాత్రమే వసూలు చేయాల్సి ఉండగా, కొన్ని జడ్పీ పాఠశాలల్లో రూ.300 నుంచి రూ.400 వరకు వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.ఇదంతా మండల విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకే జరుగుతోందని ఆరోపించారు.అదేవిధంగా బీర్కూర్ మండలంలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో B.Ed, D.Ed అర్హత కలిగిన ఉపాధ్యాయులను నియమించాల్సి ఉండగా, ఇంటర్ పాస్, ఫెయిల్ అయిన వారితోనే బోధన నిర్వహిస్తున్నారని గైని సంపత్ ఆరోపించారు.ఈ వ్యవహారాలపై ఉన్నతాధికారులు వెంటనే సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గైని సంపత్ డిమాండ్ చేశారు.

