ఐడిఓసి ప్రాంగణాన్ని తనిఖీ చేసిన జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి, జనవరి 03(డిడి9 వార్త):
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఐడిఓసి ప్రాంగణంలో పారిశుధ్య నిర్వహణపై జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్ శనివారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఐడిఓసి ఆవరణలోని సందర్శకుల పార్కింగ్ స్థలం, ప్రధాన ద్వారం, ప్రధాన ఉద్యానవనం తదితర ప్రాంతాలను ఆయన పరిశీలించారు. పరిసరాల పరిశుభ్రత, చెత్త నిర్వహణ, పచ్చదనం సంరక్షణపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.కలెక్టరేట్ పరిసరాలు శుభ్రమైన, ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉండేలా రోజువారీ పారిశుధ్య చర్యలను క్రమబద్ధంగా చేపట్టాలని, నిరంతర పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు.
అలాగే, ఐడిఓసి ఆవరణలో ఖాళీగా ఉన్న స్థలాలను గమనించి, ఆ ప్రదేశాల్లో వెంటనే మొక్కలు నాటాలని, వాటి సంరక్షణపై ప్రతి రోజు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఎక్కడా కూడా అపరిశుభ్రతకు తావు లేకుండా చెత్త చెదారం వెంటనే తొలగించాలని స్పష్టంగా ఆదేశించారు.ఐడిఓసి ప్రాంగణాన్ని ఆదర్శంగా నిలిపేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జిల్లా పాలనాధికారి హితవు పలికారు.ఈ తనిఖీ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

