ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల తీరును పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి,జనవరి 02(డిడి9 వార్త):
శుక్రవారం రామారెడ్డి మండలం గిద్ద గ్రామంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆకస్మికంగా పర్యటించి, ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధిదారుడు నిర్మించుకుంటున్న ఇంటి పనులను పరిశీలించారు. ఇంటి నిర్మాణ పనుల పురోగతిని గమనించిన కలెక్టర్, లబ్ధిదారుడితో మాట్లాడి పనుల వివరాలను తెలుసుకున్నారు. నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.ఇప్పటివరకు ఇంటి నిర్మాణానికి అయిన ఖర్చు, తీసుకున్న రుణ వివరాలు, దశల వారీగా ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధుల కేటాయింపు పరిస్థితి, గతంలో నివసించిన ప్రాంతం, ప్రస్తుతం చేస్తున్న జీవనోపాధి తదితర అంశాలపై లబ్ధిదారుడిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని, నాణ్యతతో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.అనంతరం గిద్ద గ్రామంలో డ్రైనేజీ కాలువలు, రోడ్లకు ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కల తొలగింపు పనులను కలెక్టర్ పరిశీలించారు. గ్రామంలో పరిశుభ్రత, పారిశుధ్య పరిస్థితులను మెరుగుపర్చేందుకు చేపడుతున్న చర్యలను గమనించి, సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే పిచ్చి మొక్కలు, చెత్తను పూర్తిగా తొలగించాలని, గ్రామంలో పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా నిరంతర శుభ్రత కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. రోడ్లకు ఇరువైపులా మొక్కల తొలగింపుతో పాటు నీరు నిల్వ కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ పర్యటనలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, ఆర్డీఓ వీణ, తహసిల్దార్ ఉమలత, డీపీవో, డీఎం తదితర అధికారులు పాల్గొన్నారు.

