భద్రాచలం రామాలయం లో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
భద్రాచలం, సెప్టెంబర్ 25 (డిడి 9 వార్త): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మూడో రోజైన నేడు (గురువారం) శ్రీ మహాలక్ష్మి అమ్మవారు గజలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
చెదరని అధికారం, తరగని సంపదను ప్రసాదించే శక్తి స్వరూపిణిగా గజలక్ష్మి రూపంలో అలంకరించిన అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జగన్మాతగా కీర్తిస్తూ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారికి మూడో రోజు గజలక్ష్మి అలంకరణ అనంతరం అర్చకులు స్నపన తిరుమంజనం, ప్రత్యేక పూజలు, సామూహిక కుంకుమార్చన సేవలను శాస్త్రోక్తంగా జరిపారు.
మరోవైపు, చిత్రకూట మండపంలో వేద పండితులు, అర్చకులు శ్రీ రామాయణ మహా పారాయణ మహోత్సవముల లో భాగంగా నేడు అయోధ్యా కాండ పారాయణం చేశారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తజన సందోహంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

