ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచిన డాక్టర్ సీతలే రమేష్
దాతల సహకారంతో రూ.24 వేల ఆర్థిక సహాయం – మానవత్వానికి నిదర్శనంగా సేవాభావం
బాన్సువాడ, జూలై 28(డీడీ9 వార్త): ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే నిజమైన మానవత్వమని మరోసారి నిరూపించారు లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్, ప్రముఖ స్వచ్ఛంద సేవా నాయకులు డాక్టర్ సీతలే రమేష్. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన కోటగిరి మండల కేంద్రానికి చెందిన పాల సావిత్రి కుటుంబానికి దాతల సహకారంతో సమీకరించిన రూ.24 వేల ఆర్థిక సహాయాన్ని అందించి వారి కష్టకాలంలో భరోసాగా నిలిచారు.ఈ నెల 19వ తేదీన పాల సావిత్రి, ఆమె భర్త పాల పోశెట్టి నిజామాబాద్ నుండి కోటగిరికి ద్విచక్ర వాహనంపై వస్తుండగా మోస్రా గ్రామ సమీపంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన మినీ వ్యాన్ ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్కు సమాచారం అందించి నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్లోని హోప్ ఆస్పత్రికి తరలించి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించారు.ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో చికిత్స ఖర్చులు రోజురోజుకు పెరిగి సుమారు రూ.2 లక్షలకు చేరుకున్నాయి. దీంతో నిరుపేద కుటుంబమైన పాల పోశెట్టి కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది. ఈ విషయం తెలిసిన స్థానికులు, స్నేహితులు, దాతలు తమ వంతు సహాయంగా ఫోన్పే ద్వారా విరాళాలు అందించి కుటుంబానికి కొంత ఊరటనిచ్చారు.ఇదే సమయంలో ప్రమాద వివరాలు తెలుసుకున్న డాక్టర్ సీతలే రమేష్ వెంటనే స్పందించి తన వాట్సాప్ స్టేటస్ ద్వారా దాతలను సహాయం చేయాలని కోరారు. ఆయన పిలుపుకు విశేష స్పందన లభించడంతో వివిధ ప్రాంతాలకు చెందిన దాతలు ముందుకు వచ్చి ఫోన్పే ద్వారా మొత్తం రూ.24 వేల విరాళాలను సమీకరించారు. సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే డాక్టర్ సీతలే రమేష్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు.అయితే చికిత్స పొందుతూ పాల సావిత్రి ఈ నెల 26వ తేదీన మృతి చెందడం కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది. ఆమె మరణంతో కుటుంబం తీవ్ర ఆర్థిక, మానసిక వేదనలోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో చికిత్స కోసం సమీకరించిన రూ.24 వేల మొత్తాన్ని డాక్టర్ సీతలే రమేష్ స్వయంగా పాల పోశెట్టి, వారి పిల్లలు, కుటుంబ సభ్యులకు అందజేసి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ భవిష్యత్తులో కూడా అవసరమైన సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, అత్యంత క్లిష్ట సమయంలో తమకు అండగా నిలిచి దాతలను సమీకరించి ఆర్థిక సహాయం అందించిన డాక్టర్ సీతలే రమేష్కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సమాజంలో ఇలాంటి సేవాభావం కలిగిన వ్యక్తులు ఉండడం ఎంతో గొప్ప విషయమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో పందిముక్కుల సాయిలు, దాత్తు పటేల్, సున్నం రాజు, సుధాకర్ రెడ్డి, పాల పోశెట్టి కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు, దాతలు పాల్గొన్నారు. కష్టకాలంలో మానవత్వంతో ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

