యోగతో ఆరోగ్యం – బాన్సువాడలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
బాన్సువాడ, జూన్ 21(డిడి9 వార్త): అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని బాన్సువాడలోని యస్ఎంబీ ఫంక్షన్ హాల్లో ఆర్డీవో రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో, ఆయుష్ విభాగం నిర్వహణలో యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు, నర్సింగ్ కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగా సాధన చేశారు. యోగా ద్వారా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవరచుకోవాలని ప్రతిజ్ఞ చేశారు.ఈ సందర్భంగా ఆర్డీవో రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, యోగ భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన వరమని, ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో యోగను భాగం చేసుకుంటే శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుందని తెలిపారు. నేటి ఒత్తిడి జీవనశైలిలో యోగ ఉత్తమ పరిష్కార మార్గమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కుశాల్, ఆయుష్ విభాగం వాలంటరీ శ్రీనివాస్ గౌడ్, కాసుల రోహిత్, కాలెక్, గౌస్, మంద ప్రవీణ్ కుమార్, లక్క నరహరి, నర్వ శ్రీనివాస్, చందర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల్లో యోగపై అవగాహన పెంచేందుకు నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

