బరంగ్ ఏడ్గి అభివృద్ధికి భారీ నిధులు-రూ.1.70 కోట్లతో బైపాస్ రోడ్, డ్రైనేజీ–సీసీ పనులకు శ్రీకారం
ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు నిలిపేయాలి : ఏఎంసీ డైరెక్టర్ గోండ్ల రాజు
బీర్కూర్, ఫిబ్రవరి 19(డిడి9 వార్త):
మండలంలోని బరంగ్ ఏడ్గి గ్రామంలో ఎస్డీఎఫ్ నిధులు రూ.1.70 కోట్లతో చేపట్టనున్న బైపాస్ రోడ్, డ్రైనేజీ మరియు సీసీ రోడ్డు అభివృద్ధి పనులను గురువారం ప్రారంభించారు. ఈ పనులు గ్రామ అభివృద్ధికి కీలకంగా మారనున్నాయని స్థానిక నాయకులు పేర్కొన్నారు.ఈ సందర్భంగా బీర్కూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోండ్ల రాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి సహకారంతో గ్రామ బైపాస్ రోడ్డుకు రూ.1.70 కోట్ల నిధులు మంజూరైనందుకు గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాభివృద్ధికి ప్రభుత్వం ద్వారా వచ్చిన ఈ నిధులను సమర్థవంతంగా వినియోగించుకుంటామని అన్నారు.గతంలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద రూ.30 లక్షల నిధులతో రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు గుర్తుచేశారు. ఆ పనులు పూర్తయి కొంత భాగం మిగిలి ఉండగా ఇటీవల వాటిని పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఈ విషయంపై అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.తాము గెలిచినా, ఓడినా ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తామని, గ్రామాభివృద్ధి కోసం ప్రభుత్వం మరియు ప్రజాప్రతినిధుల సహకారంతో మరిన్ని నిధులు తీసుకువస్తామని చెప్పారు. గ్రామ అభివృద్ధిలో పోటీ ఉండాలే గాని విమర్శలతో అడ్డంకులు సృష్టించడం తగదని సూచించారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నంతకాలం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి సహకారంతో గ్రామానికి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదేపురం గంగారాం, గాజుల పండరి, ఇందూర్ గజేందర్, బోయి లాలయ్య, శావులం శంకర్, గోండ్ల గంగారాం, సూపర్వైజర్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

