మట్టి దందాకు అడ్డుకట్టేదీ..? అధికారుల మౌనమే కారణమా..?
అనుమతులు లేవు.. ఆపేవారు లేరు.. బాజాన్ చెరువులో మట్టి మాఫియా రాజ్యం
బీర్కూర్, జూన్ 18(డిడి9 వార్త):
బీర్కూర్ మండల కేంద్రంలోని బాజాన్ చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు, తరలింపు జరుగుతోందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఎలాంటి అనుమతులు లేకుండానే చెరువులోని మట్టిని టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా విచ్చలవిడిగా తరలిస్తున్నారని వారు పేర్కొన్నారు.ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు మట్టి రవాణా కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు విమర్శిస్తున్నారు. సాయంత్రం 06 గంటలు దాటినా మట్టి తరలింపు కొనసాగుతుండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు.చెరువుల పరిరక్షణ బాధ్యత ఉన్న అధికారులు అక్రమ మట్టి దందాపై ఎందుకు స్పందించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంలో కొందరు అధికారులకు ముడుపులు ముట్టాయా అనే అనుమానాలను కూడా స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.బాజాన్ చెరువులో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలు, తరలింపుపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. చెరువు పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకుని అక్రమ మట్టి దందాకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.

