బాన్సువాడలో వీధికుక్కల దాడి.. చిన్నారికి తీవ్ర గాయాలు
బాన్సువాడ, జూలై 30(డిడి9 వార్త):
బాన్సువాడ పట్టణంలోని టీచర్స్ కాలనీలో గురువారం విషాదకర ఘటన చోటుచేసుకుంది.గోతి నానక్ సింగ్ కుమార్తె రిషిత ఇంటి వద్ద ఆడుకుంటున్న సమయంలో వీధికుక్కలు ఒక్కసారిగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది.దాడిని గమనించిన స్థానికులు వెంటనే చిన్నారిని బాన్సువాడ మాతా-శిశు సంరక్షణ ఆసుపత్రికి తరలించారు.అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని సూచించారు.సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఈఎంటీ ప్రసాద్, పైలట్ సుభాష్ వెంటనే స్పందించి ఘటనాస్థలానికి చేరుకున్నారు.ఈఆర్సీపీ సూచనల మేరకు చిన్నారికి అవసరమైన అత్యవసర వైద్య సహాయం అందిస్తూ సురక్షితంగా నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.108 అంబులెన్స్ సిబ్బంది అందించిన వేగవంతమైన సేవలను చిన్నారి తల్లిదండ్రులు, టీచర్స్ కాలనీ వాసులు అభినందిస్తూ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు 108 సిబ్బంది వెల్లడించారు.ఈ ఘటనతో కాలనీవాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, వీధికుక్కల బెడదను నివారించేందుకు మున్సిపల్ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

