సైబర్ నేరాల పట్ల అప్రమత్తత అవసరం : బోధన్ పట్టణ ఎస్సై హబీబ్

సైబర్ నేరాల పట్ల అప్రమత్తత అవసరం : బోధన్ పట్టణ ఎస్సై హబీబ్

మన ఊరు - మన భద్రత – మన బాధ్యత’ అనే నినాదంతో పట్టణ ప్రజల్లో చైతన్యం నింపేందుకు బోధన్ పోలీసులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా బోధన్ పట్టణంలోని రద్దీగా ఉండే పాత బస్టాండ్ ఆవరణలో ఎస్సై హబీబ్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. మారుతున్న సాంకేతికతతో పాటు నేరస్తుల శైలి కూడా మారుతోందని, దీనిని గమనించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హితవు పలికారు.

​ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.... నేడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉండటంతో సైబర్ నేరగాళ్లు అమాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంక్ ఖాతా వివరాలు, పిన్ నంబర్లు, ముఖ్యంగా ఓటీపీ లను ఎవరితోనూ పంచుకోవద్దని స్పష్టం చేశారు. తెలియని వ్యక్తులు పంపే మెసేజ్‌లు, ఈ-మెయిల్స్, ఆకర్షణీయమైన ఆఫర్ల లింకులను క్లిక్ చేయవద్దని ఆయన హెచ్చరించారు. ఒకవేళ పొరపాటున ఆన్‌లైన్ మోసానికి గురైతే అధైర్యపడకుండా, వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు కాల్ చేసి వివరాలు నమోదు చేయాలని సూచించారు. దీనివల్ల బాధితుల సొమ్మును రికవరీ చేసే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

​అనంతరం ట్రాఫిక్ నిబంధనల ఆవశ్యకతపై ఎస్సై హబీబ్ మాట్లాడుతూ... రోడ్డు భద్రత అనేది ప్రతి పౌరుడి బాధ్యత అని గుర్తు చేశారు. ద్విచక్ర వాహనదారులు ప్రాణ రక్షణ కోసం తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనం నడిపేటప్పుడు సెల్ ఫోన్ మాట్లాడటం, అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం వంటివి ప్రమాదకరమని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానాలు కట్టాల్సి రావడమే కాకుండా, ప్రాణాపాయం కూడా సంభవించే అవకాశం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వాహనదారులు తమ వెంట డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ వంటి పత్రాలను ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, వాహనదారులు, పోలీసు, ట్రాఫిక్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Views: 25
Tags:

About The Author

Latest News