రాబోయే పండుగల దృష్ట్యా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలి : సీపీ సాయిచైతన్య
రాబోయే పండుగల నేపథ్యంలో నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సీపీ పి.సాయిచైతన్య అధికారులను ఆదేశించారు. బోధన్ డివిజన్ పోలీసు అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేరాల కట్టడికి ప్రత్యేక వ్యూహాలతో పనిచేయాలని సూచించారు. పాత నేరస్థులు, రౌడీషీటర్లపై నిరంతర నిఘా ఉంచాలని, సరిహద్దు ప్రాంతాల్లో వాహనాల తనిఖీలను కట్టుదిట్టం చేయాలని ఆయన పేర్కొన్నారు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్, చీతా ఫోర్స్ బృందాలను అప్రమత్తంగా ఉంచడంతో పాటు రద్దీ ప్రాంతాల్లో నిఘా పెంచాలని ఆదేశించారు. డ్రగ్స్, గంజాయి వంటి అక్రమ వ్యాపారాలపై ఉక్కుపాదం మోపి, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ వంటి కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి తక్షణమే భద్రతా చర్యలు చేపట్టాలని, ప్రజలకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీలు పి.శ్రీనివాస్, గురునాయుడు, సీఐలు వెంకట నారాయణ, విజయ్ బాబు, కృష్ణ ఎస్సైలు పాల్గొన్నారు.

