నకిలీ అక్రెడిటేషన్ కార్డుపై పోలీసులకు డీపీఆర్ఓ ఫిర్యాదు
నిజామాబాద్ జిల్లాలో కలెక్టర్ సంతకం ఫోర్జరీ ఉదంతం తీవ్ర కలకలం రేపింది. వాట్సాప్తో పాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో పి.శ్రీనివాస్ అనే వ్యక్తి పేరిట నకిలీ మీడియా అక్రెడిటేషన్ కార్డు చెలామణి అవుతున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ఈ నకిలీ కార్డును సృష్టించేందుకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. దీనిపై స్పందించిన నిజామాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారి ఎన్.పద్మశ్రీ జిల్లా పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సదరు అక్రెడిటేషన్ కార్డును సమాచార పౌర సంబంధాల శాఖ నిజామాబాద్ జిల్లా కార్యాలయం నుంచి జారీ చేయలేదని డీపీఆర్ఓ పద్మశ్రీ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ కార్డును తయారు చేసిన సదరు వ్యక్తిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు. ఎవరైనా ఈ తరహాలో నకిలీ అక్రెడిటేషన్ కార్డులను తయారు చేసినా, లేదా వాటిని వినియోగించినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె ఈ సందర్భంగా హెచ్చరించారు.

