బడిబాటతో.. ప్రభుత్వ బడుల్లోకి చేరికలు
రాంపూర్, కల్దుర్కిల్లో ఐదుగురు విద్యార్థుల నమోదు
ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకతలను వివరించిన ఎంఈఓ నాగయ్య
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యతో పాటు అన్ని రకాల ఉచిత వసతులు అందుబాటులో ఉన్నాయని, తల్లిదండ్రులందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని బోధన్ మండల విద్యాధికారి నాగయ్య పిలుపునిచ్చారు.
బోధన్ మండల పరిధిలోని రాంపూర్, కల్దుర్కి గ్రామాల్లో శుక్రవారం “ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట” కార్యక్రమాన్ని విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా నిర్వహించారు. ఇందులో భాగంగా రాంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పరిధిలో ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరిగారు. పాఠశాల వయస్సు కలిగిన పిల్లలను గుర్తించి, ప్రభుత్వ బడుల ప్రాధాన్యతను వివరించారు.
దీని ప్రభావంతో ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తున్న నలుగురు విద్యార్థులు రాంపూర్ ప్రభుత్వ పాఠశాలలో చేరగా, కల్దుర్కి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరో బాలుడు కొత్తగా చేరాడు. బడిబాట మొదటి రోజే ఐదుగురు విద్యార్థులు ప్రభుత్వ బడుల వైపు మొగ్గు చూపడం విశేషం.
ఈ సందర్భంగా ఎంఈఓ నాగయ్య తల్లిదండ్రులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో లభించే నాణ్యమైన బోధన, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు మరియు మధ్యాహ్న భోజన సౌకర్యాలను వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.

