బీడీ కార్మికులకు ఆంక్షల్లేని పెన్షన్ ఇవ్వాలి
ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ డిమాండ్.. రుద్రూర్లో ధర్నా
ఎలాంటి ఆంక్షలు లేకుండా అర్హులైన బీడీ కార్మికులందరికీ 'చేయూత' పథకం కింద నెలకు రూ.4,000 పింఛను వెంటనే మంజూరు చేయాలని ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. రుద్రూర్ మండల కేంద్రంలో యూనియన్ బోధన్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం బీడీ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక అంగడి బజారు నుంచి సమీకృత మండల కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లి, అక్కడ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు బి. మల్లేష్ మాట్లాడుతూ.. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు బీడీ కార్మికులకు తక్షణమే నాలుగు వేల రూపాయల పింఛన్ అందించాలన్నారు. వచ్చే జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కొత్త పెన్షన్లు ఇస్తామని మంత్రులు ప్రకటనలు చేస్తున్నారని, ఈ ప్రక్రియలో కట్ ఆఫ్ డేట్ నిబంధనను పూర్తిగా తొలగించి కార్మికులందరికీ న్యాయం చేయాలని కోరారు.
ప్రభుత్వం స్పందించని పక్షంలో బీడీ కార్మికులందరినీ ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఇన్చార్జి అధికారికి అందజేశారు. అయితే, అధికారులు కార్మికుల వ్యక్తిగత దరఖాస్తు ఫారాలను స్వీకరించేందుకు నిరాకరించడంతో ఆగ్రహించిన కార్మికులు సమీకృత మండల భవన సముదాయంలోనే బైఠాయించి నిరసన తెలిపారు. ఈ ఆందోళన కార్యక్రమంలో యూనియన్ బోధన్ ఏరియా కమిటీ నాయకులు శోభ, బుజ్జి, లతా, శంకరమ్మ, లక్ష్మీ, గంగామణితో పాటు పెద్ద సంఖ్యలో బీడీ కార్మికులు పాల్గొన్నారు.

