ప్రభుత్వ బడిలోనే నాణ్యమైన విద్య, వసతులు : ఎడపల్లి సర్పంచ్ కందగట్ల రామచందర్
ప్రభుత్వ బడుల బలోపేతానికి కరపత్రాల ఆవిష్కరణ
ప్రభుత్వ బడుల్లో లభించే నాణ్యమైన విద్య, వసతులపై విద్యార్థుల తల్లిదండ్రులకు విస్తృతంగా అవగాహన కల్పించి, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎడపల్లి గ్రామ సర్పంచ్ కందగట్ల రామచందర్ పిలుపునిచ్చారు.
బడి బాట కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా ఎడపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విశిష్టతను, ప్రభుత్వం ద్వారా విద్యార్థులకు అందుతున్న ఉచిత సౌకర్యాలను వివరిస్తూ ముద్రించిన ప్రత్యేక కరపత్రాన్ని శుక్రవారం గ్రామ సర్పంచ్ కందగట్ల రామచందర్, గ్రామ పెద్దలు పోల మల్కారెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో కూడిన నాణ్యమైన బోధన అందుతుందని, లభించే వసతులను గ్రామీణ ప్రాంత విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా సర్పంచ్ కోరారు. బడి ఈడు పిల్లలందరినీ ప్రభుత్వ బడుల్లోనే చేర్పించేలా ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవికుమార్, ఉపాధ్యాయులు సురేష్ కుమార్, సంజీవ్ కుమార్ మరియు ఇతర గ్రామస్థులు పాల్గొన్నారు.

