సమానత్వంతోనే సమాజ వికాసం
లింగ వివక్షకు వ్యతిరేకంగా బాలురకు ప్రత్యేక శిక్షణ
సమాజంలో స్త్రీ, పురుషుల మధ్య సమానత్వం ఉన్నప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమని ఆ దిశగా యువత అడుగులు వేయాలని నిపుణులు పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో బేటి బచావో – బేటి పడావో కార్యక్రమంలో భాగంగా మహిళా, శిశు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహకారంతో భీంగల్ లోని మైనారిటీ బాలుర నివాస పాఠశాలలో గురువారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఏఆర్ విద్యా సంస్థ ప్రతినిధుల ఆధ్వర్యంలో యువ కిశోర బాలురకు లింగ సమానత్వం అనే అంశంపై ఈ శిక్షణ సాగింది. ఈ సందర్భంగా శిక్షకులు అపర్ణ మాట్లాడుతూ.. సమాజంలో వేళ్లూనుకున్న లింగ వివక్షను ఉదాహరణలతో వివరించారు. బాల్యం నుంచే ఆడ, మగ అనే తేడా లేకుండా పరస్పర గౌరవం, సమాన హక్కులు కలిగి ఉండాలని సూచించారు. మహిళలు, బాలికలపై జరుగుతున్న హింసను నివారించడంలో బాలుర పాత్ర ఎంతో కీలకమని, వివక్ష లేని సమాజ నిర్మాణానికి యువత నడుం బిగించాలని కోరారు. లింగ సమానత్వంతో పాటు ప్రస్తుత కాలంలో యువత పెడదోవ పట్టకుండా ఉండటానికి మాదకద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే నష్టాలను వివరించారు. అలాగే బాలలపై జరుగుతున్న లైంగిక దాడుల నిరోధక చట్టం (పోక్సో) పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ వంటి సామాజిక రుగ్మతలను రూపుమాపడంలో సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. యువత బాధ్యతాయుతంగా వ్యవహరించినప్పుడే సామాజిక మార్పు సాధ్యమవుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిశు అభివృద్ధి సేవల పథకం (ఐసీడీఎస్) పర్యవేక్షకులు శారద, విజయరాణి, పాఠశాల ప్రధానాచార్యులు, సిబ్బందితో పాటు జిల్లా మహిళా సాధికారత కేంద్రం ప్రతినిధులు స్వప్న, సౌమ్య, కవిత, విద్యార్థులు పాల్గొన్నారు.


