మానవత్వం చాటుకున్న అంకోల్ గ్రామ యువత.. మృతుని కుటుంబానికి ఆర్థిక చేయూత
బాన్సువాడ, ఫిబ్రవరి 12(డిడి9 వార్త):
మూడు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో అంకోల్ గ్రామానికి చెందిన పసుపుల సాయి అకాల మరణం చెందడంతో గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది. నిరుపేద కుటుంబానికి చెందిన సాయి మరణంతో కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి తీవ్ర ఆవేదనలో ఉంది.ఈ ఘటన గ్రామ యువతను కదిలించింది. సాయి కుటుంబాన్ని ఆదుకోవాలనే సంకల్పంతో యువకులు ఏకమై చందాలు సేకరించారు.తమ స్నేహితుడి కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ స్పందించి మొత్తం రూ.63,500 సేకరించారు.సేకరించిన ఈ మొత్తాన్ని గురువారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేసి, కష్టకాలంలో వారికి కొంత భరోసా కల్పించారు.డబ్బు మనిషిని తిరిగి తీసుకురాలేదు, కానీ ఈ కష్ట సమయంలో కుటుంబానికి తోడుగా నిలవడం మా బాధ్యత అని యువత తెలిపారు.మానవ సేవయే మాధవ సేవ అన్న భావాన్ని ఆచరణలో చూపించిన అంకోల్ గ్రామ యువకులను గ్రామస్తులు, పరిసర ప్రాంత ప్రజలు అభినందిస్తున్నారు.

