బాన్సువాడలో కుక్కల బీభత్సం
పసిపిల్లల నుంచి పెద్దల వరకు వరుస దాడులు.. ప్రజల్లో భయాందోళన
బాన్సువాడ, ఆగస్టు 9(డిడి9 వార్త): బాన్సువాడ పట్టణంలో వీధికుక్కల బెడద రోజురోజుకూ తీవ్రమవుతోంది. పట్టణంలోని వివిధ కాలనీల్లో కుక్కలు గుంపులుగా సంచరిస్తూ పసిపిల్లల నుంచి పెద్దల వరకు ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాయి. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.తాజాగా ఈరోజు సంగమేశ్వర కాలనీలో వీధికుక్కలు దాడి చేయడంతో సితార (3), ఖాలీద్ బాబు (6)తో పాటు ఆఫ్రోజ్ (25) గాయపడ్డారు.చిన్నారి సితారకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.ప్రతిరోజూ పట్టణంలోని ఏదో ఒక కాలనీలో కుక్కల దాడులు జరుగుతున్నప్పటికీ అధికారులు శాశ్వత పరిష్కారం చూపడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు రోడ్లపైకి రావాలంటే భయపడుతున్నారని తెలిపారు.ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, సంబంధిత శాఖలు వెంటనే స్పందించి వీధికుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలని, ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని పట్టణవాసులు కోరుతున్నారు.

