బోధన్లో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి
విజయ సాయి పాఠశాలలో ఆకట్టుకున్న తెలుగు భాషా ప్రదర్శన

బోధన్ పట్టణంలోని శ్రీ విజయ సాయి ఉన్నత పాఠశాలలో తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురువారం పాఠశాలలో తెలుగు భాషా ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ముందుగా ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పాఠశాల యాజమాన్యం, తెలుగు అధ్యాపక బృందం, అకాడమిక్ ఇంచార్జ్ సువర్చల పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ప్రారంభమైన ఈ ప్రదర్శనలో సుమారు 150 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని 115 రకాల ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. తెలుగు వర్ణమాల నుంచి ఛందస్సు వరకు భాషా విశేషాలను ప్రదర్శించారు. తెలంగాణ మాండలిక పదాలు, ఆటల ద్వారా అక్షరాల కూర్పు, సామెతలు, భాషా పరిజ్ఞానాన్ని చాటే పటాలు, తెలంగాణ సాంప్రదాయ కళారూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా విద్యార్థుల తెలంగాణ తల్లి, రాముడు, సీత, లక్ష్మణుడు, లవకుశ వేషధారణలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్. కృష్ణమోహన్, మేనేజర్ చక్రవర్తి, అకాడమిక్ ఇంచార్జ్ సువర్చల, తెలుగు విభాగ అధిపతి శిరీష, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


