రైతులకు యూరియా అందించాలని బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో
ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు యూరియా అందించాలని భారీ ఎత్తున రాస్తారోకో చేపట్టారు. భద్రాచలం – భూపాలపట్నం ప్రధాన రహదారిపై బైఠాయించి గంటల పాటు ఆందోళన కొనసాగింది.
ఈ సందర్భంగా బిఆర్ఎస్ మండల అధ్యక్షులు గంప రాంబాబు మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీ కల్లబొల్లి హామీలతో అధికారంలోకి వచ్చి రైతులను రోడ్లమీద నిలబెడుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ వాస్తవమై, రైతులు తెల్లవారుజామునే షాపుల ముందు క్యూల్లో నిలబడే పరిస్థితి వచ్చింది. కానీ కేసీఆర్ ప్రభుత్వంలో పదేళ్ల పాటు రైతులు యూరియా కోసం ఎప్పుడూ లైన్లో నిలబడలేదని” విమర్శించారు.
అలాగే, “మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ సీజన్కి ముందుగానే రైతుల కోసం యూరియా బస్తాలను నిల్వ ఉంచేవారు. కానీ ముందుచూపు లేని కాంగ్రెస్ పాలన కారణంగా ఇప్పుడు రైతులకు రెండు బస్తాలు దొరకాలంటే రోజు మొత్తం ఎండలో కష్టపడాల్సి వస్తోంది” అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక కాలేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. “ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాలేశ్వరం, కోట్లాది ఎకరాలకు సాగునీరు అందించి, వరదలను తట్టుకుని నిలబడింది. కానీ కాంగ్రెస్ మాత్రం రాజకీయ లాభాల కోసం ప్రాజెక్టును దెబ్బతీసే ప్రయత్నం చేస్తోంది” అని మండిపడ్డారు.
అలాగే, “తెలంగాణ రాష్ట్ర హక్కులను విస్మరించి, నీటిని ఆంధ్రప్రదేశ్కు విడుదల చేయడం ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలే గుణపాఠం చెబుతారు” అని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వేల్పురి లక్ష్మీనారాయణ, మలిదశ ఉద్యమ నాయకులు సిడేం రవికుమార్, పార్టీ ప్రతినిధి డర్ర దామోదర్, మాజీ సర్పంచులు పూనెం శ్రీదేవి, పూజారి ఆదిలక్ష్మి, తురస సూరిబాబు, మాజీ ఎంపీటీసీ సాంబశివరావు, యువ నాయకులు చెరుకూరి సతీష్, గడ్డం వివేక్, బట్ట నాగేంద్రబాబు, రామెల్ల మోహన్ రావు, బేగా సాంబశివరావు, గుండారపు పోతురాజు, తోట ప్రశాంత్, సతీష్, మాజీ మహిళా అధ్యక్షురాలు జానకమ్మ, ఎస్సీ సెల్ అధ్యక్షులు చిట్టిబాబు, కొప్పుల వినోద్, యూత్ అధ్యక్షులు నాని, నామణ సాయి, తుమ్మ రామకృష్ణ, నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.

