ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రామాలయం విస్తా కాంప్లెక్స్ ముంపు - సిపిఎం ఆగ్రహం
భద్రాచలం సెప్టెంబర్ 27 డిడి 9 వార్త భద్రాచలం పట్టణం లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ప్రభావంతో గోదావరి నీటి మట్టం పెరుగుతుండగా, పట్టణంలోని రామాలయం విస్తా కాంప్లెక్స్, నిత్య అన్నదాన సత్రం ముంపుకు గురైంది. ఈ పరిస్థితికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని సిపిఎం పట్టణ కమిటీ తీవ్రంగా విమర్శించింది.పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి మాట్లాడుతూ, అలర్ట్ మోడ్లో ఉండాల్సిన ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించడంతో ఈ దుస్థితి చోటుచేసుకుందన్నారు. కలకట్ట స్లూయిజులు, బ్యాక్ వాటర్ డ్రైనేజీ సమస్య పరిష్కారానికి సిపిఎం ఆధ్వర్యంలో ఇంతకుముందే దశలవారీగా ఆందోళనలు జరిగినా గత ప్రభుత్వాలు పెడచెవిన పెట్టాయని తెలిపారు.ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే నిధులు కేటాయించి, కలకట్ట అభివృద్ధి పనులతో పాటు పట్టణ డ్రైనేజీ సమస్యను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.

