కుషాయిగూడలో దారుణం.. భార్యను కత్తితో నరికి భర్త పరార్
మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో భయానక హత్యకేసు
కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. భార్యను కత్తితో నరికి హత్య చేసిన భర్త, వెంటనే అక్కడి నుంచి పరారైన సంఘటన స్థానికులను షాక్కు గురి చేసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం – యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలంలోని అడ్డగూడూర్ గ్రామానికి చెందిన బోడ శంకర్ (40), మంజుల (35) దంపతులు కుటుంబ సమస్యలతో తరచూ గొడవపడేవారని సమాచారం. వీరికి ముగ్గురు సంతానం – ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.
నాలుగు రోజుల క్రితం శంకర్ కుటుంబంతో కలిసి మహేశ్నగర్ కాలనీలోని తన సోదరి ఇంటికి వచ్చాడు. అక్కడే నివాసం ఉంటూ వచ్చారు. శుక్రవారం అర్ధరాత్రి అందరూ నిద్రలో ఉండగా, శంకర్ భార్య మంజులపై కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాల కారణంగా మంజుల అక్కడికక్కడే మృతిచెందింది.
ఆమె కేకలు వినిపించగానే కుటుంబ సభ్యులు మెలుకువ వచ్చారు. అప్పటికే శంకర్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. వెంటనే కుషాయిగూడ పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హంతకుడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని పోలీసులు తెలిపారు.

