శిశు మరణాల అడ్డుకట్టకు ప్రత్యేక ప్రణాళిక
కాపాడదగ్గ ఏ ప్రాణమూ పోవద్దు
పీహెచ్సీల సిబ్బందితో డీఎంహెచ్ఓ సమీక్ష
మన చేతిలో ఉండి ఎటువంటి నిర్లక్ష్యం వహించకుండా కాపాడదగ్గ ప్రతి ప్రాణాన్ని కాపాడే బాధ్యత మనందరిపై ఉందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి.రాజశ్రీ పేర్కొన్నారు. డీఎంహెచ్ఓ కార్యాలయంలో 10 పీహెచ్సీల వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలతో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. వైద్య సిబ్బంది తమ నైపుణ్యాన్ని పెంచుకుంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. ఆపద సమయంలో ప్రాణాలు కాపాడేందుకు సిబ్బందికి సీపీఆర్ పై అవగాహన ఉండాలని, ప్రథమ చికిత్స కిట్లు, అత్యవసర కిట్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. గర్భిణులను క్రమం తప్పకుండా పర్యవేక్షించడమే కాకుండా, మహిళా శిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్ శాఖల సహకారంతో ఆయా గ్రామాల్లో కుటుంబ నియంత్రణ, తల్లిపాల ప్రాముఖ్యతపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో డీఐఓ డాక్టర్ అశోక్, డెప్యూటీ డీఎంహెచ్ఓలు రవీందర్, విద్య, సికందర్ నాయక్, నిపుణులు డాక్టర్ నవీన్, డాక్టర్ అరుణరేఖ, డీఎస్ఓ వెంకటేష్, డీహెచ్ఈలు, ఏఎన్ఎంలు, ఆశాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


