ప్రత్యేక అవసరాల చిన్నారుల చెంతకు కలెక్టరమ్మ
భవిత కేంద్రాల ఆకస్మిక తనిఖీ
పిల్లలతో మమేకమైన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
జిల్లాలోని ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు అండగా నిలిచే 'భవిత' కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆర్మూర్, నందిపేట మండల కేంద్రాల్లోని కేంద్రాలను సందర్శించిన ఆమె, అక్కడ అందుతున్న సేవలను స్వయంగా పరిశీలించారు. అధికారుల ఆడంబరాలకు తావులేకుండా, చిన్నారులతో నేరుగా ముచ్చటించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడం గమనార్హం.
ఆర్మూర్ భవిత కేంద్రంలో కలెక్టర్ సామాన్య వ్యక్తిలా చిన్నారులతో కలిసిపోయారు. ప్రతి బిడ్డను పేరుపేరునా పలకరిస్తూ ఆత్మీయంగా కరచాలనం చేశారు. వారికి చాక్లెట్లు పంపిణీ చేసి, వారితో కాసేపు సరదాగా గడిపారు. అనంతరం కేంద్రంలోని యాక్టివిటీ రూమ్, థెరపీ రూమ్లను పరిశీలించి, చిన్నారులకు అందుతున్న శిక్షణపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. చిన్నారుల భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని స్పష్టం చేశారు. "పిల్లలకు గాయాలయ్యే అవకాశం ఉన్న పదునైన వస్తువులను కేంద్రాల దరిచేరనీయకండి. నిరంతరం అప్రమత్తంగా ఉండాలి" అని సిబ్బందిని హితవు పలికారు.
నందిపేట్ లో నిర్మాణ దశలో ఉన్న భవిత కేంద్రం పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రభుత్వ ధనం దుర్వినియోగం కాకుండా, భవన నిర్మాణం పూర్తి నాణ్యతతో ఉండాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా దివ్యాంగ చిన్నారుల సౌకర్యార్థం ర్యాంపు వంటి వసతులను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. పనుల్లో జాప్యాన్ని సహించేది లేదని, యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, జిల్లా విద్యాశాఖాధికారి (పి.అశోక్, ఇంజినీరింగ్ అధికారులు రవి, ఉదయ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

