పండుగలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలి : సీపీ పి.సాయి చైతన్య
రాబోయే ఉగాది, హోలీ, పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో సోదరభావంతో పండుగలను జరుపుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య పిలుపునిచ్చారు. శనివారం నిజామాబాద్ పోలీస్ కమీషనరేట్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హాల్ నందు నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలోని అన్ని మతాల పెద్దలతో ఆయన శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.... నిజామాబాద్ జిల్లా గంగా-జమునా తహజీబ్కు ప్రతీక అని, ఇక్కడ అన్ని మతాల వారు కలిసిమెలిసి ఉంటారని కొనియాడారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను, పుకార్లను ఎవరూ నమ్మకూడదని ఆయన సూచించారు. సమాజంలో విద్వేషాలు రగిల్చేలా లేదా రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రంజాన్ మాసం ప్రారంభమైన నేపథ్యంలో మసీదుల వద్ద ప్రార్థనల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన భద్రత మరియు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడుతున్నట్లు సీపీ తెలిపారు. ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని లేదా డయల్ 100 సేవలను వినియోగించుకోవాలని కోరారు. శాంతి కమిటీ సమావేశానికి విచ్చేసిన మత పెద్దలు తమ తమ ప్రాంతాల్లోని ప్రజలకు సమన్వయం, శాంతి పట్ల అవగాహన కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్లో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసు యంత్రాంగానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు డీసీపీ (అడ్మిన్) జి.బస్వా రెడ్డి, ఏసీపీలు ప్రకాష్, శ్రీనివాస్, వెంకట్ రెడ్డి, మస్తాన్ అలీ, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, వివిధ స్టేషన్ల సీఐలు జిల్లాలోని అన్ని మతాల పెద్దలు పాల్గొన్నారు.


