రాష్ట్రస్థాయి క్రీడల్లో నిజామాబాద్ జిల్లా భవిత విద్యార్థుల ప్రతిభ
మెడల్స్ సాధించిన విజేతలను అభినందించిన కలెక్టర్
ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు క్రీడా మైదానంలో సత్తా చాటారు. హైదరాబాద్లో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన భవిత కేంద్రాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. విజేతలుగా నిలిచిన చిన్నారులు గురువారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులు సాధించిన మెడల్స్, ప్రశంసా పత్రాలను పరిశీలించి, వారిని పేరుపేరునా అభినందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంలో భవిత కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని కొనియాడారు. సాధారణ విద్యార్థులతో సమానంగా వీరికి అన్ని రంగాల్లో ప్రోత్సాహం అందిస్తామని భరోసా ఇచ్చారు. తల్లిదండ్రులు తమ పిల్లలను భవిత కేంద్రాల్లో చేర్పించి, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యార్థులను పోటీలకు సిద్ధం చేసిన ఐ.ఆర్.పీలు, విద్యాశాఖ అధికారుల కృషిని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, పలువురు ఉపాధ్యాయులు, భవిత కేంద్రాల సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ చిన్నారులతో కలిసి ఫోటోలు దిగి వారిలో ఉత్సాహాన్ని నింపారు.


