రోడ్డు ప్రమాదంలో గాయపడిన కానిస్టేబుల్కు సీపీ పరామర్శ
రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పోలీస్ కానిస్టేబుల్ ఎన్.గంగా ప్రసాద్ను నిజామాబాదు పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య సోమవారం పరామర్శించారు. జిల్లా పాస్పోర్ట్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ 1921 (గంగా ప్రసాద్) ఈ నెల 15న జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం నగరంలోని మెడికవర్ హాస్పిటల్కు తరలించారు. విషయం తెలుసుకున్న సీపీ ఆసుపత్రికి చేరుకొని కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రసాద్కు అందుతున్న చికిత్స గురించి అక్కడ ఉన్న వైద్య బృందంతో సిపి చర్చించారు. బాధితుడికి ఎటువంటి లోటు లేకుండా మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. అనంతరం బాధితుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఓదార్చారు. పోలీస్ శాఖ తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, ధైర్యంగా ఉండాలని వారికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ మణిదీప్ రెడ్డి, డాక్టర్ వను, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఎస్సై సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

