ల్యాబ్ టెక్నీషియన్లు రికార్డుల నిర్వహణలో పారదర్శకత పాటించాలి : డీఎంహెచ్ఓ రాజశ్రీ
నిజామాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖలోని కీటక జనిత వ్యాధుల నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో ల్యాబ్ టెక్నీషియన్లు, హెల్త్ అసిస్టెంట్లకు మలేరియా, ఫైలేరియా వ్యాధులపై శనివారం ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డీఎంహెచ్ఓ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి.రాజశ్రీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కీటక జనిత వ్యాధుల నియంత్రణలో ల్యాబ్ టెక్నీషియన్ల పాత్ర కీలకమని, రికార్డుల నిర్వహణలో పూర్తి పారదర్శకత పాటించాలని ఆదేశించారు. ముఖ్యంగా ప్రభుత్వం సూచించిన 11 రకాల రిజిస్టర్లను పక్కాగా నిర్వహించాలని, వ్యాధుల నిర్ధారణ పరీక్షల్లో జాప్యం చేయకూడదని స్పష్టం చేశారు. మలేరియా, ఫైలేరియా వంటి వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ, క్షేత్రస్థాయిలో బాధితులను గుర్తించి తగిన చికిత్స అందేలా హెల్త్ అసిస్టెంట్లు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కీటక జనిత వ్యాధుల నియంత్రణ అధికారులు, ల్యాబ్ టెక్నీషియన్లు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

