మత్తు కోరల్లో చిక్కొద్దు.. జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకోవద్దు : సీపీ సాయిచైతన్య
బోధన్లో నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో భారీ అవగాహన సదస్సు

"నేటి యువతే రేపటి దేశ భవిష్యత్తు. కానీ, క్షణికానందం కోసం మత్తు పదార్థాలకు బానిసలై బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దు" అని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య పిలుపునిచ్చారు. నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో శనివారం బోధన్లోని రమాకాంత్ ఫంక్షన్ హాల్లో యువతకు డ్రగ్స్, సైబర్ భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 1500 మంది కళాశాల విద్యార్థులు హాజరయ్యారు.
సదస్సులో సీపీ సాయిచైతన్య స్వయంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను వివరించారు. సరదాగా లేదా స్నేహితుల ప్రలోభాలతో మొదలయ్యే చిన్న అలవాటు.. క్రమంగా వ్యసనంగా మారి విద్యార్థుల కెరీర్ను, కుటుంబాన్ని ఎలా నాశనం చేస్తుందో సోదాహరణంగా వివరించారు. డ్రగ్స్ వల్ల కలిగే శారీరక వ్యాధులు, మానసిక అస్థిరత, ఆర్థిక ఇబ్బందులపై ఆయన హెచ్చరించారు. డ్రగ్స్ సరఫరా చేయడం, వాడటం లేదా వాటికి సహకరించడం చట్టరీత్యా తీవ్రమైన నేరం. వ్యసనాలకు లోనై నేరాల బాట పట్టవద్దని సీపీ స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థి 'డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ' సాధనలో భాగస్వామి కావాలని కోరారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా పిల్లల ప్రవర్తనను గమనిస్తూ వారిని సరైన మార్గంలో నడిపించాలని సూచించారు. ఏదైనా సమాచారం ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. కేవలం మాదకద్రవ్యాలే కాకుండా.. పెరుగుతున్న సైబర్ నేరాలు, మహిళల రక్షణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై విద్యార్థులకు క్షుణ్ణంగా అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి కవితా రెడ్డి, ట్రెజరర్ కేతం సంతోష్, జాయింట్ సెక్రటరీలు దుష్వంత్, డాక్టర్ శిరీష్, హితిన్ భీమాని, డాక్టర్ ఉషారాణి, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు కొడాలి కిషోర్, సాంబిరెడ్డితో పాటు బోధన్ ఏసీపీ శ్రీనివాస్, సీఐలు వెంకటనారాయణ, విజయ్ బాబు, ఎస్సైలు, ట్రాఫిక్ సిబ్బంది, విద్యార్ధిని, విద్యార్దులు పాల్గొన్నారు.


