రోబోటిక్ ఇంజనీరింగ్లో శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
కమ్మర్ పల్లి మండలంలోని బషీరాబాద్ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో నిరుద్యోగ యువతీ, యువకుల కోసం ఉచిత స్వల్పకాలిక కోర్సులను నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఎం.కోట్టి రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అర్హులైన అభ్యర్థులు ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రస్తుత పారిశ్రామిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆటోమోటివ్, ఆటోమేషన్ అండ్ రోబోటిక్ ఇంజనీరింగ్ కోర్సును ప్రవేశపెట్టినట్లు ఆయన వివరించారు. మూడు నెలల కాలపరిమితి కలిగిన ఈ కోర్సుకు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కనీసం పదో తరగతి ఉత్తీర్ణులైన వారు, ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ ఉత్తీర్ణులైన వారితో పాటు ఫెయిల్ అయిన వారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. అభ్యర్థుల కనీస వయస్సు 24 ఏళ్లు నిండి ఉండాలని శిక్షణ సమయంలో ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ హాజరు తప్పనిసరని పేర్కొన్నారు. ఈ కోర్సు ద్వారా అభ్యర్థులకు ఆధునిక ఆటోమోటివ్ మరియు రోబోటిక్స్ రంగాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ప్రాక్టికల్ శిక్షణ అందిస్తామని ప్రిన్సిపాల్ వివరించారు. ఇక్కడ పొందే సర్టిఫికేట్ విదేశీ ఉద్యోగ ప్రయత్నాలకు ఎంతో దోహదపడుతుందని, అలాగే ప్రముఖ కంపెనీల్లో ఉపాధి పొందేందుకు మార్గం సుగమం అవుతుందని తెలిపారు. కళాశాలలో సీట్లు పరిమితంగా ఉన్నందున ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించారు. ఆసక్తి గల అభ్యర్థులు ఇతర వివరాల కోసం నేరుగా బషీరాబాద్లోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

