విద్యార్థుల మేధస్సుకు ఆవిష్కార్ వేదిక
సృజనాత్మకతకు వైజ్ఞానిక ప్రదర్శనలే దిక్సూచి : నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
విద్యార్థుల్లో నిబిడీకృతమై ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు, వారిని రేపటి తరం పరిశోధకులుగా తీర్చిదిద్దేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఒక గొప్ప వేదికని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉద్ఘాటించారు. గురువారం జిల్లా కేంద్రంలోని నవ్యభారతి గ్లోబల్ స్కూల్ ఆవరణలో ఆవిష్కార్ - యంగ్ ఇన్నోవేటర్స్ ఇన్ యాక్షన్ పేరిట నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన వైజ్ఞానిక నమూనాలను ఆమె ఎంతో ఆసక్తితో తిలకించారు. ప్రతి స్టాల్ వద్ద ఆగి, విద్యార్థులతో ముచ్చటించి, వారు చేసిన ప్రయోగం వెనుక ఉన్న ఉద్దేశాన్ని, దాని పనితీరును అడిగి తెలుసుకున్నారు. చిన్న వయసులోనే సామాజిక సమస్యలకు శాస్త్రీయ పరిష్కారాలు చూపడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు తమ మేధస్సుకు పదును పెట్టి ప్రస్తుత సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లకు అద్దం పట్టేలా అనేక నమూనాలను ప్రదర్శించారు. పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టే సాధనాలు, వ్యర్థాల నిర్వహణ పద్ధతులు మరియు పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రయోగాలు ఆకట్టుకున్నాయి. శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా సోలార్ వినియోగంపై రూపొందించిన ప్రాజెక్టులు భవిష్యత్తు అవసరాలను గుర్తుచేశాయి. లాభదాయకమైన కూరగాయల పంటల సాగు, నీటి పొదుపు పద్ధతులపై విద్యార్థులు చూపిన అవగాహన అభినందనీయం. సూర్య గడియారం పనితీరుతో పాటు అంతరిక్ష పరిశోధనలపై రూపొందించిన నమూనాలు విద్యార్థుల శాస్త్రీయ జిజ్ఞాసకు నిదర్శనంగా నిలిచాయి. ట్రాఫిక్ నిబంధనల ఆవశ్యకత, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించే స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం జరిగిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు కేవలం మార్కులు, ర్యాంకుల కోసం తరగతి గది పాఠాలకే పరిమితం కాకూడదని హితవు పలికారు. ప్రయోగాత్మక విద్య ద్వారానే లోతైన అవగాహన వస్తుందని, ఇలాంటి సైన్స్ ఫేర్లు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయని అన్నారు. విద్యార్థులను పరిశోధనల దిశగా ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నవ్యభారతి పాఠశాల యాజమాన్యాన్ని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో జిల్లా వ్యాప్తంగా మరిన్ని పాఠశాలల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ సంతోష్, శ్రీదేవి, ప్రిన్సిపాల్ ఆంథోని, లత, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


