పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి
రూ. 30 వేల నగదు, ఫోన్లు స్వాధీనం.. ఇద్దరి అరెస్ట్
నిజామాబాద్ జిల్లాలో జూదగాళ్ల ఆటకట్టించేందుకు పోలీసులు కొరడా ఝుళిపించారు. జిల్లా పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఉత్తర్వుల మేరకు, సీసీఎస్ ఇన్ఛార్జ్ ఏసీపీ మస్తాన్ అలీ నేతృత్వంలో పోలీసులు బుధవారం జిల్లావ్యాప్తంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏఆర్పీక్యాంప్ ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా పేకాట సాగుతున్నట్లు అందిన సమాచారంతో సీసీఎస్ సిబ్బంది ఒక్కసారిగా విరుచుకుపడ్డారు.
పోలీసుల రాకను గమనించిన జూదగాళ్లు చెల్లాచెదురుగా పరుగులు తీయగా, పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురు వ్యక్తులు ఘటనా స్థలం నుంచి పరారయ్యారు. పట్టుబడిన వారి నుంచి రూ. 30,000 నగదుతో పాటు రెండు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను, నగదును తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం ఎడపల్లి ఎస్హెచ్ఓకు అప్పగించారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని, ఇలాంటి స్థావరాలపై నిఘా కొనసాగుతుందని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.

